బెంగుళూర్ లో దారుణం : యువతిని బలవంతగా కారులో ఎక్కించుకొని రాత్రంతా తిప్పుతూ అత్యాచారం

బెంగుళూర్ లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పార్క్ లో కూర్చున్న యువతిని బలవంతగా కారులో ఎక్కించుకొని రాత్రంతా తిప్పుతూ అత్యాచారం చేసిన ఘటన బయటకు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..గత నెల 25న నగరంలోని కోరమంగళ నేషనల్ గేమ్స్ పార్క్ వద్ద బాధిత యువతి తన స్నేహితుడితో కలిసి కూర్చుంది. అదే సమయంలో అక్కడికొచ్చిన ఓ యువకుడు ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించాడు. ఆ విషయం నీకెందుకని, నీ పని నువ్వు చూసుకోవాలని వారు హెచ్చరించారు. దీంతో అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయిన యువకుడు కాసేపటి తర్వాత మరో ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చి యువతి స్నేహితుడిని బెదిరించి ఆమెను బలవంతంగా కారులోకి ఈడ్చుకెళ్లారు. రాత్రంతా ఆమెను కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో యువతిని ఆమె ఇంటి సమీపంలో వదిలి పరారయ్యారు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామంటూ బెదిరించారు.

అయితే, విషయాన్ని యువతి తన తల్లికి చెప్పడంతో ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లి కోరమంగళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సతీశ్, విజయ్, శ్రీధర్, కిరణ్‌లను అరెస్ట్ చేశారు. నిందితులందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారని, వారిలో ఒకడు బాధితురాలి స్నేహితుడేనని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరు ఆఫీస్ బాయ్స్ కాగా, ఒకడు ఎలక్ట్రీషియన్ అని, మరో వ్యక్తి బీపీవోలో పనిచేస్తున్నట్టు తెలిపారు.