జనజీవ స్రవంతిలో కలిసిన 18 మంది మావోలు
దంతెవాడ కలెక్టర్, ఎస్పీల ఎదుట లొంగుబాటు
చత్తీస్గఢ్: 18 మంది మావోయిస్టులు తీవ్రవాదానికి స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టు అనుబంధ సంస్థలైన చేతన నాట్యమండలి, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్కు చెందిన 18 మంది మావోయిస్టులు చత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ‘మావోయిస్టులూ.. తిరిగి ఇంటికి రండి’ అంటూ చేసిన ప్రచారంతోనే వీరంతా లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన అందరికీ టైలరింగ్, నిర్మాణ పనుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సీఆర్పీఎఫ్ డీఐజీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. లొంగిపోయిన 18 మంది తలపై ఉన్న లక్ష రూపాయల రివార్డును వారికే ఇస్తామని పేర్కొన్నారు. మరోవైపు, మావోయిస్టు సీనియర్ కమాండర్ను అరెస్ట్ చేశామని, బుల్లెట్ గాయంతో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించినట్టు ఐటీబీపీ పోలీసులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/