ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడి, యోగి
బాధిత కుటుంబాలకు పరిహారం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు సచెంది వద్ద జేసీబీని ఢీకొని బ్రిడ్జి పైనుంచి కిందపడింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలంలోనే పలువురు మరణించారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. యూపీ రోడ్ వేస్‌కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ప్రమాదం విషయం తెలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు, ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/