ఈ నెల 13 వరకు ఆత్మకూరులో 144 సెక్షన్‌ అమలు

జనవరి 13 వరకు ఆత్మకూరులో 144 సెక్షన్‌ అమలు కానుంది. ఓ ప్రార్థనా మందిరం నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య శనివారం తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా బీజేపీ నేత శ్రీకాంత్‌రెడ్డిపై ఓ వర్గం వారు దాడికి యత్నించగా, ఆయన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న ఆందోళనకారులు శ్రీకాంత్‌రెడ్డి కారును ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కంటికి గాయం కాగా, మరో ఇద్దరు ఎస్ఐలు గాయపడ్డారు.

ఈ క్రమంలో ఆత్మకూరు పట్టణంలో నిషేధాజ్ఞలు విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 13వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తహసీల్దార్‌ ప్రకాశ్‌బాబు ప్రకటించారు. మొత్తం 500 మందితో కూడిన అదనపు పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మతవిద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలకు చెందిన 30 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఆత్మకూరు పట్టణంలో పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేశారు.