గుజరాత్ లో కూలిన వంతెన ఘటన లో 141 చేరిన మృతుల సంఖ్య

గుజరాత్‌ మోర్బీలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన లో ఇప్పటివరకు 141 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరగనుందని అంటున్నారు. మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తీగల వంతెన నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది వరకు ఉన్నారు. ప్రమాదం జరిగాక కొందరు నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకోగా, మరికొందరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొట్టుకుపోయిన వారి కోసం బోట్ల సాయంతో గాలిస్తున్నారు. అయితే బ్రిడ్జి ఆధునీకరణ పనుల కోసం గత ఆరు నెలలుగా వంతెన పైకి సందర్శకుల్ని అనుమతించ లేదు. పనులు పూర్తి చేసిన తర్వాత గత ఐదు రోజుల నుంచి సందర్శకుల్ని అనుమతించారు. ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం ఎక్కువ మంది నడవటంతో పాటు జన సాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బ్రిజేష్ మెర్జా ప్రకటించారు. ప్రమాదం నేపథ్యంలో గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని హోం మంత్రి హర్ష్ సంఘ్వి తెలిపారు.