ఆత్మకూరుకు ముగిసిన ఉప ఎన్నిక నామినేషన్ గడువు

బరిలో 14 మందిమొత్తం 28 నామినేషన్లు దాఖలు

ఆత్మకూరు : శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించిన తుది జాబితా సిద్ధమైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగియడంతో పోటీపడే అభ్యర్థుల తుది జాబితా కొలిక్కి వచ్చింది. ఉప ఎన్నిక కోసం మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 13 తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 15 మంది బరిలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరణ చివరి రోజైన నిన్న బొర్రా సుబ్బారెడ్డి అనే వ్యక్తి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బరిలో 14 మంది నిలిచారు. ఈ నెల 23న ఉప ఎన్నిక జరగనుండగా 26న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఈ ఉప ఎన్నికలో వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ తరపున భరత్ కుమార్ పోటీలో ఉండగా, బీఎస్‌పీ తరపున నందా ఓబులేసు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలు మాత్రం పోటీకి దూరంగా ఉన్నాయి. ఉప ఎన్నికలో మొత్తం 2,13,330 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కూడా అందుబాటులో ఉండనుంది. వికలాంగులు, వృద్ధులు, కరోనా బాధితులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/