పెళ్లింట పెను విషాదం.. బావిలో పడి 13 మంది మహిళల మృతి

ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఘటన
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం
విచారం వ్యక్తం చేసిన సీఎం యోగి

లక్నో: పెళ్లి వేడుకకు హాజరైన వారిలో 13 మంది మహిళలు బావిలో పడి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియాలో జరిగింది. పెళ్లికి హాజరైన వారిలో పలువురు మహిళలు సమీపంలోని ఓ బావి స్లాబ్‌పై కూర్చున్నారు. వారి బరువుకు తట్టుకోలేని ఆ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దానిపై కూర్చున్న వారందరూ ఒక్కసారిగా బావిలో పడిపోయారు.

ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు ఆనందంగా సాగిన వివాహ వేడుక ఈ ఘటనతో విషాదంగా మారిపోయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/