పాకిస్థాన్‌లో భారీ పేలుళ్లు.. 13 మంది మృతి

పేలుళ్ల ధాటికి మరో 50 మందికి గాయాలు

13 die in twin blasts at Pakistan police station

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ లో జంట పేలుళ్లు సంభవించాయి. వాయవ్య పాకిస్థాన్ లోని స్వాత్ లోయలో ఈ పేలుళ్లు జరిగాయి. కౌంటర్ టెర్రరిజం ఆయుధగారంపై జరిగిన ఈ దాడిలో 13 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో కౌంటర్ టెర్రరిజం అధికారులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. పేలుళ్లు జరిగిన సమయంలో ఆఫీసు పక్క నుంచి నడుచుకుంటూ వెళుతున్న తల్లీ కొడుకులు కూడా ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని షహబాజ్ అహ్మద్ ట్విట్టర్ లో స్పందించారు.

తొలుత ఈ ఘటనను ఆత్మాహుతి దాడిగా పేర్కొన్న ప్రధాని.. ఘటనపై విచారణ జరిపిస్తామని, టెర్రరిజంపై పోరులో పాక్ పోలీసులు ముందుంటారని చెప్పారు. సోమవారం రాత్రి మరోమారు ట్వీట్ చేస్తూ.. ఈ పేలుళ్లకు కారణాన్ని గుర్తించేందుకు అధికారులు విచారణ చేస్తున్నారని ప్రధాని తెలిపారు.

కాగా, స్వాత్ లోయతో పాటు చుట్టుపక్కల ప్రాంతమంతా గతంలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల అధీనంలో ఉండేది. 2009లో మిలటరీ ఆపరేషన్ నిర్వహించి పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది. ఆ తర్వాత ఇక్కడ కౌంటర్ టెర్రరిజం ఆఫీసును, ఆయుధగారాన్ని ఏర్పాటు చేసింది. పోలీసులు, కౌంటర్ టెర్రరిజం ఆఫీసర్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ విధులు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం జరిగిన జంటపేలుళ్లు ఈ కౌంటర్ టెర్రరిజం ఆయుధగారాన్ని లక్ష్యంగా చేసుకున్నవేనని పోలీసులు తెలిపారు.