తెలంగాణ చెల్లించడం కాదు..ఏపీనే రూ. 12,940 కోట్లు చెల్లించాలి – మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కరెంట్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 30 రోజుల్లోగా ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. విభజన తర్వాత 2014-2017వరకూ తెలంగాణ డిస్కంలకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రూ. 3,441 కోట్ల ప్రిన్సిపల్‌ అమౌంట్‌, రూ. 3,315 కోట్ల లేట్‌ పేమెంట్‌ సర్‌ చార్జీలు చెల్లించాలి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆదేశాలపై తెలంగాణ మంత్రి జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘మాకు ఏపీ నుంచి విద్యుత్తు బకాయిలు రావాల్సి ఉన్నది. వాటినుంచి మేము ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను మినహాయించుకొంటే.. మాకే సుమారు రూ.12,940 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది’ అని గణాంకాలతో సహా బయటపెట్టారు. కేంద్రం నిజంగానే పెద్ద మనిషిలాగా వ్యవహరించాలనుకొంటే.. ఇరు పక్షాల నుంచి గణాంకాలను తెప్పించుకొని, ఎవరు ఎవరికి చెల్లించాలనేది తేల్చాలి.

అలా కాకుండా ఏకపక్షంగా, వివక్షాపూరితంగా తెలంగాణ విద్యుత్తు సంస్థలు 30 రోజుల్లో విద్యుత్తు బకాయిలను ఏపీ విద్యుత్తు సంస్థలకు చెల్లించాలంటూ ఏకంగా ఆర్డరు పాస్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. జాతీయ ప్రభుత్వంగా చెయ్యల్సింది కాదు… తెలంగాణాను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలు అని ఆగ్రహించారు.