దేశంలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి నేడు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇది 28.8 శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 1,17,100 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

తాజా కేసులతో కలుపుకుని మొత్తం కేసుల లోడు 3,52,26,386కు పెరిగింది. కేసులు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర (36,265) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (15,421), ఢిల్లీ (15,097), తమిళనాడు (6,983), కర్ణాటక (5,031) రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే, గత 24 గంటల్లో 302 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,83,178కి పెరిగింది. తాజా మరణాల్లో అత్యధికంగా కేరళలో 221 కేసులు నమోదు కాగా, పశ్చిమ బెంగాల్‌లో 19 మంది మరణించారు. ఇక, రికవరీ రేటు 97.57 శాతంగా ఉండడం ఊరటనిచ్చే విషయం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/