నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ

వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
ప్రధానోపాధ్యాయుల వద్ద కూడా హాల్ టికెట్లు

హైదరాబాద్: ఈ నెల 23 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో మొత్తం 5,08,275 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నేటి నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను WWW.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. లేదంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల నుంచి కూడా హాల్‌ టికెట్లను తీసుకోవచ్చన్నారు.

పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. మే 23న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్ గ్రూప్-ఏ, ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్), ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్), 24న సెకండ్ లాంగ్వేజ్, మే 25న థర్డ్ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌), 26న మ్యాథమెటిక్స్‌, 27న జనరల్‌ సైన్స్‌ పేపర్ (ఫిజికల్‌, బయోలాజికల్‌ సైన్స్‌), 28న సోషల్‌ స్టడీస్‌, 30న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ –1 (సంస్కృతం, అరబిక్‌), 31న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ – 2 (సంస్కృతం, అరబిక్‌), జూన్ 1న ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్స్‌ (థియరీ) పరీక్షలు ఉంటాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/