ఏపీలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో వసతులు సరిగాలేవని విద్యార్థుల ఆందోళన

ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈరోజు నుండి మొదలయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 2 వేల 537 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది ఉన్నారు. మొత్తం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు అరగంట ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్నా సరే లోనికి అనుమతి ఇస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షా కేంద్రాల్లో సరైన వసతులు లేవని విద్యార్థులు , విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. రెయిన్‌బో పాఠశాల వద్ద పరీక్ష కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించకపోవడంతో… విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఫ్యాన్లు కూడా లేని గదుల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. ఇదేంటని ప్రశ్నిస్తే… తామేం చేయలేమంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కనీసం ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని… విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. గుడ్లూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి రాస్తున్న విద్యార్థులకు పొగ సెగ తగిలింది. పాఠశాల సమీపంలో చెత్తాచెదారాన్ని.. గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడంతో.. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది. ఆ పొగలోనే విద్యార్థులు కూర్చొని పరీక్ష రాస్తున్నారు.