ఆ యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరు : ఐక్యరాజ్యసమితి
న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగి నిన్నటితో వంద రోజులు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో యూఎన్ తాజా కామెంట్ చేసింది. ఈ యుద్ధంలో గెలుపు ఎవరికీ దక్కదని, గడిచిన వంద రోజుల్లో నష్టమే జరిగిందని, ఇండ్లను, ఉద్యోగాలను, ప్రాణాలను కోల్పోయారని, యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అమిన్ అవద్ తెలిపారు. ఉక్రెయిన్లో అయిదో వంతు భాగం రష్యా ఆధీనంలో ఉన్నట్లు కీవ్ అధికారులు వెల్లడించారు. యుద్ధం వల్ల ప్రజలపై భారం పడిందని, సాధారణ ప్రజల జీవితాలు నాశనమైనట్లు అవద్ తెలిపారు. కేవలం మూడు నెలల్లోనే సుమారు కోటి 4 లక్షల మంది ఇండ్లు విడిచి వెళ్లారన్నారు. దీంట్లో మహిళలు, పిల్లలే ఉన్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం శాంతి కావాలని, ఈ యుద్ధం ఇప్పుడు ముగిసిపోవాలని యూఎన్ తన ప్రకటనలో తెలిపింది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/movies/