దేశంలో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించనున్న ఎల్ఐసి
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)… భారత దేశంలో ఈ పేరు తెలియని వారుండరు. కోట్ల మంది జీవితాలకు బీమా రక్షణ కల్పిస్తూ, ఆపత్కాలంలో ఆదుకునే నేస్తంగా దీనికి గుర్తింపు ఉంది. 60 ఏళ్ళ నుంచి దేశ ప్రజల సేవకు అంకితమైన ఈ ప్రభుత్వ రంగ సంస్థ… త్వరలోనే స్టాక్ మార్కెట్ల లో లిస్ట్ అవబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన సందర్భంగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి మరోసారి ఎల్ఐసి పై పడింది. ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యం లో నడుస్తున్న సంస్థ అనే విషయం తెలిసిందే. ఈ సంస్థ విలువ మదింపు చేయటం ఒకరకంగా క్లిష్టమైన పని. ఎందుకంటే, రూ లక్షల కోట్లలో స్థిర, చర ఆస్తులను కలిగి ఉంది. అందుకే, ఒక వేళ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా ఎల్ఐసి గనుక స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయితే… విలువ పరంగా అదే దేశంలో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించనుంది. మార్కెట్ క్యాపిటలైజెషన్ ప్రకారం ముకేశ్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్ కూడా ఎల్ఐసి ముందు చిన్నబోనున్నాయి. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/