షర్మిల పార్టీపై షబ్బీర్ అలీ వ్యాఖ్యలు
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు.. షబ్బీర్ అలీ
హైదరాబాద్: దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటుపై హైదరాబాద్లో సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సొంతంగా పార్టీ పెట్టుకోవచ్చని అన్నారు. తమకు ఏ పార్టీ కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని షబ్బీర్ అన్నారు.
వైఎస్ మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని షబ్బీర్ పేర్కొన్నారు. వైఎస్కు కుటుంబసభ్యులు వారసులు కారని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే వైఎస్కు నిజమైన వారసులని ఆయన తెలిపారు. వైఎస్ను సిఎం చేసింది కాంగ్రెస్ పార్టీనేని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.