విమర్శలు మాని..రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీవానిస్ యాదవ్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో టిఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని స్పష్టం చేశారు. నిన్న జరిగిన ఎన్నికలో సాధారణ మెజార్టీతో మేయర్, డిప్యూటీ మేయర్ గెలిచామని తెలిపారు. బిజెపి నాయకులు ప్రభుత్వం మీద విమర్శలు మాని.. రాష్ర్టాభివృద్ధికి సహకరించాలన్నారు. రాష్ర్టంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు.
టిఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు అయ్యాయని బిజెపి నేతలు నీచంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మతం పేరుతో బిజెపి నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి నేతలు బాధ్యాతయుతంగా మాట్లాడాలని సూచించారు. బిజెపి ఇతర పార్టీలతో అనైతిక పొత్తు పెట్టుకుని ఏయే రాష్ర్టాల్లో గెలిచారో దేశ ప్రజలకు తెలుసన్నారు. ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీనా? అని ప్రశ్నించారు. తమ పార్టీ అన్ని వర్గాలను కలుపుకుపోతోందన్నారు. ముఖ్యమంత్రిని తిడితే తమకు దేశ నాయకులను తిట్టడం చేత కాదా? అని ప్రశ్నించారు. తమకు సంస్కారం ఉంది కాబట్టే.. నష్టం జరిగినా దేశ నాయకులపై గౌరవం చూపుతున్నామని తెలిపారు.