వాలంటీర్లకు సిఎం జగన్‌ లేఖ

మీకు ఇస్తున్నది వేతనం కాదు..గౌరవ భృతి

అమరావతి: ఏపిలో వలంటీర్ల వేతనాల పెంపు కోరుతూ చేస్తున్న ఆందోళనలపై సిఎం జగన్‌ స్పందించారు. ఈ మేరకు వారిని ఉద్దేశించి లేఖ రాశారు. వేతనాలు పెంచాలని కోరుతూ వలంటీర్లు డిమాండ్ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాస్తవాలతో పనిలేకుండా రోడ్డెక్కారన్న వార్త తనను బాధించిందని జగన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి వలంటీర్లకు ఇస్తున్నది వేతనం కాదని, గౌరవ భృతి మాత్రమేనని పేర్కొన్నారు. వలంటీర్లకు వస్తున్న మంచి పేరును తుడిచేసి, అసలా వ్యవస్థే లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

వలంటీర్లు వారానికి ఇన్ని గంటలు, ఇన్ని రోజులు పనిచేయాలన్న నిబంధన ఏదీ లేదని సీఎం పేర్కొన్నారు. తాను హ్యాండ్‌బుక్‌లోనూ ఇదే విషయాన్ని రాశానని గుర్తు చేశారు. సేవా దృక్పథం ఉన్న యువతీయువకులను రూ. 5 వేల వేతనంతో గ్రామ/వార్డు వలంటీర్లుగా నియమిస్తామని, ఇంతకంటే మెరుగైన ఉద్యోగం వచ్చే వరకు పనిచేస్తారని పేర్కొన్నానని జగన్ ఆ లేఖలో గుర్తు చేశారు.

వలంటీర్లుగా కాకుండా వేతనం కోసం పనిచేస్తే ఇప్పుడు మీకు లభిస్తున్న గౌరవం లభించి ఉండేదా? అని ప్రశ్నించారు. మీ సేవలకు అవార్డుగా, మీకు ఇవ్వవలసిన గౌరవాన్ని మీకు దక్కకుండా చేసేందుకు, వస్తున్న మంచి పేరును చెడగొట్టేందుకు ఎవరు కుట్రలు పన్నుతున్నారో తనకు తెలుసని అన్నారు. రెచ్చగొట్టే వారికి, ప్రలోభాలకు దూరంగా ఉండాలని ఓ అన్నలా, శ్రేయోభిలాషిలా విజ్ఞప్తి చేస్తున్నట్టు జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.