వర్షాలపై వివరణ ఇచ్చిన విజయలక్ష్మి

ఈ ఐదేళ్లు వర్షాలు రాకూడదని దేవుడిని మొక్కుకుంటాను..కొత్త మేయ‌ర్

హైదరాబాద్‌: తన పదవీకాలంలో వర్షాలు రాకూడదని దేవుడ్ని మొక్కుకుంటాను అంటూ హైదరాబాద్ నగర నూతన మేయర్ విజయలక్ష్మి అన్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై మేయర్ విజయలక్ష్మి వివరణ ఇచ్చారు. వర్షాల అంశంలో తాను వెల్లడించిన అభిప్రాయాలను వక్రీకరించారని ఆరోపించారు.

గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా హైదరాబాదును భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయని, ఆ స్థాయిలో వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడ్ని కోరుకున్నానే తప్ప, అసలు హైదరాబాదులో వర్షాలే పడకూడదని తాను మొక్కుకోలేదని వివరణ ఇచ్చారు. ఆ విధంగా జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని విజయలక్ష్మి అన్నారు. తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపారు.

అటు, షేక్ పేట తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో తన పాత్ర ఉందన్న ఆరోపణలపైనా ఆమె వివరణ ఇచ్చారు. తహసీల్దార్ బదిలీ వ్యవహారం రెవెన్యూ విభాగానికి సంబంధించిన విషయం అని, అది తన పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు. తనపై రాజకీయ ఒత్తిళ్లు ఏమీ లేవని తహసీల్దార్ కూడా చెప్పారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/