‘రాజ్‌ భవన్‌ అన్నం’ క్యాంటీన్‌ ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సోమవారం ‘రాజ్‌ భవన్‌ అన్నం’ పేరిట రాజ్ భవన్ కమ్యూనిటి హాల్ లో క్యాంటీన్ ప్రారంభించారు. ఈ రాజ్ భవన్ అన్నం క్యాంటీన్ ద్వారా రాజ్ భవన్ స్కూల్లో చదివే విద్యార్ధులకు, రాజ్ భవన్ లో పనిచేసే సానిటేషన్, గార్డెనింగ్ లాంటి పనులు చేసే సిబ్బందికి ప్రతిరోజూ ఉచిత అల్పాహారం అందిస్తారు. ఉచిత, బలవర్ధకమైన అల్పాహారం అందించాలన్న గవర్నర్ సంకల్పానికి, శ్రీ సత్య సాయి సేవా సమితి ముందుకు వచ్చి ఈ కార్యంలో భాగస్వామ్యం తీసుకుంది.

ఈ క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం, గవర్నర్ దంపతులు రాజ్ భవన్ పాఠశాల విద్యార్ధులు, సిబ్బంది, సానిటేషన్ వర్కర్లకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. వారితో కలిసి అల్పాహారం తిన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. విద్యార్ధులకు ఉదయం బలవర్ధకమైన పోషకాహారాన్ని అందించడం కీలకమన్నారు. ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు. వారి అకాడమిక్ ప్రతిభ కూడా మెరుగవుతుంది, వారి డ్రాపవుట్ రేట్ తగ్గుతుంది. నూతన జాతీయ విద్యా విధానం -2020 ద్వారా కూడా దేశవ్యాప్తంగా పాఠశాల పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ అందించే విధానం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

చాలామంది పిల్లల లంచ్ బాక్స్ లో చిప్స్, ఇతర ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఉంటున్నాయి. సరైన పోషకాహారంతో కూడిన లంచ్, బ్రేక్ ఫాస్ట్ విద్యార్ధులకు అందించాలి అన్నారు. రోజుకు ఒక టిఫిన్ చొప్పున, వారం పాటు పోషక విలువలున్న అల్పాహారాన్ని విద్యార్ధులకు, సానిటేషన్ సిబ్బందికి అందిస్తామని సత్య సాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు మల్లేశ్వర్ రావు తెలిపారు. గవర్నర్ ఆలోచనలకు ప్రతి రూపం కల్పిస్తూ ఈ ఙరాజ్ భవన్ అన్నంచ కేంద్రం ద్వారా ఉచిత, బలవర్ధక ఆహారం అందించడం సత్య సాయి సేవా సమితికి గర్వకారణంగా ఉందన్నారు.