మేయర్ ఎన్నికతో మా ఆరోపణలు నిజమయ్యాయి

తెలంగాణను వ్యతిరేకించిన వారితో పొత్తా?: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మేయర్ ఎన్నికల్లో మజ్లిస్‌తో టిఆర్‌ఎస్‌ పార్టీ పొత్తు పెట్టుకోవడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పరోక్షంగా పొత్తు పెట్టుకుని బరిలోకి దిగాయంటూ ఎన్నికల్లో తాము చేసిన ఆరోపణలు మేయర్ ఎన్నిక సందర్భంగా రుజువైందని అన్నారు.

తెలంగాణను వ్యతిరేకించిన పార్టీతో టిఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని పొత్తు పెట్టుకుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సిఎం కెసిఆర్‌, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఇద్దరూ ఒకే ప్లేట్‌లో బిర్యానీ తినే రకమని, ప్రజలు ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. నగరానికి సంబంధించిన నిర్ణయాలు దారుస్సలాంలో జరుగుతున్నాయని, కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలి? పోలీసులు ఎవరుండాలి? రెవెన్యూ అధికారులు ఎవరుండాలన్న నిర్ణయాలు కూడా అక్కడే జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు.