మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మి?

డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత?

హైదరాబాద్‌: గ్రేటర్‌ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం టిఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం పోటీ పడుతుండగా, అభ్యర్థులు ఎవరనేది మరికాసేపట్లో తేలిపోనుంది. టిఆర్ఎస్ నుంచి పోటీపడే అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఇప్పటికే నిర్ణయించి సీల్డ్ కవర్‌లో దానిని మంత్రులకు అందించారు. కెసిఆర్ ఎంపిక చేసిన వారిలో టిఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె గద్వాల విజయ లక్ష్మి, మోతె శ్రీలత ఉన్నట్టు సమాచారం.

విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా, శ్రీలతను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలోనే ఆమె మేయర్ పీఠం కోసం కూడా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఈసారి మాత్రం ఆమెకు పక్కా అని చెబుతున్నారు. శ్రీలత తార్నాక నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

మరోవైపు, ఇప్పటికే మంత్రులు తలసాని, మహ్మద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్‌ సహా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి వారు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళతారు.‌