మునుగోడు ఎన్నికల ఈవీఎంలను రీప్లేస్ చేస్తున్నారుః కేఏ పాల్

హైదరాబాద్ః మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సంచలన ఆరోపణలు చేశారు. మునుగోడు ఎన్నికల- ఈవీఎం లను మానుప్యులేట్, రీప్లేస్ చేస్తున్నారని ఆయన అన్నారు. రాత్రి ఈవీఎం లతో వచ్చిన ట్రక్.. అనుకోకుండా మాయమైందని ఆరోపించిన ఆయన.. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం గోల్ మాల్ చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగకపోతే తాను 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు పంచినా.. తాను మాత్రం ఒక్క రూపాయి కూడా పంచకుండా గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక అని కేఏ పాల్ పేర్కొన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో గెలిస్తే తాను సీఎం అవుతానని కేఏ పాల్ జోస్యం చెప్పారు. ‘‘ నేను స్వయంగా వంద బూత్ లను పరిశీలించా.. నాకు 1లక్ష 10వేలు పడ్తాయి.. నాపై నమ్మకం ఉంచిన ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసపాత్రుడిగా ఉంటా..’’ అని కేఏ పాల్ అన్నారు. తాను ప్రపంచ వ్యాప్తంగా 155 దేశాలు తిరిగానని గుర్తు చేశారు.

అసలు కెసిఆర్ ఎవరు..? తెలంగాణ ద్రోహి, నాలుగు లక్షల కోట్లు అప్పులు చేస్తారా..? ఆయనేమైనా అంబేద్కర్ నా..? కేఏ పాల్ నా..? అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో ఓడిపోతున్నానని కెసిఆర్ కు అర్థమైందన్నారు. దేశంలో బిజెపి ఈడీ, సీబీఐలను వాడుకుంటుంటే.. కెసిఆర్ మాత్రం సీబీసీఐడిని వాడుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణను అభివృద్ది చేద్దామంటే.. ఎందుకు ముందుకు రావట్లేదు.. ? మునుగోడు లో అసలు ఏమైనా అభివృద్ది జరిగిందా..? అని కేఏ పాల్ ప్రశ్నించారు. సేవ్ ఇండియా ఫ్రమ్ మోడీ’ పేరుతో బుక్ రాశానని కేఏ పాల్ వెల్లడించారు. ‘‘నిన్న ఉపఎన్నిక జరిగితే.. రెండు రోజుల తర్వాత కౌంటింగ్ ఏంటి..? కోర్టు చెప్పినా.. ఎందుకు సెక్యూరిటీ, గన్ మేన్లను ఇవ్వట్లేదు. మీ బహిరంగ సభలో జనాలు ఎక్కడైనా ఉన్నారా..? ఆ టైమ్ లో అంతా నా దగ్గర 40వేల మందికి పైగా ఉన్నారు.. ఈవీఎం టాంపరింగ్ జరక్కపోతే.. మినిమమ్ 50వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా.. మునుగోడు ప్రజల సమస్య పరిష్కారం కోసం తిరుగుతా.. కేఏ పాల్ సీఎం, సీఎం అంటూ స్లోగన్ చేస్తుంటే.. ఎస్పీ హడలిపోయారు… ప్రపంచంలోని ఎందరో నియంతలను చూశా.. కెసిఅర్ లాంటి వారిని మాత్రం చూడలేదు.. నేను అందరినీ సమానంగా చూస్తాను.. కెసిఅర్ ఐదు లక్షల కోట్లు అప్పులు చేస్తే . మోడీ 80 లక్షల కోట్లు అప్పులు చేశారు..’’ అని కేఏ పాల్ విమర్శించారు. కెసిఆర్ ముక్త్, బిజెపి ముక్త్, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ చేస్తానని కేఏ పాల్ జోస్యం చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/