ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

కాసేపట్లో ఓట్ల లెక్కింపు, ఆపై ఫలితాల వెల్లడి

అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికలకు రెండో దశ పోలింగ్‌ ముగిసింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగిసింది. రెండో విడతలో 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో 2,786 సర్పంచ్ స్థానాలకు, 20,817 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.

కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు మినహా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి 76.11 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. తొలి విడత మాదిరే ఈసారి కూడా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరికాసేట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆపై ఫలితాలు ప్రకటిస్తారు.