భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

వరంగల్‌: రాష్ట్రమంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వరంగల్‌ పట్టణంలోని భద్రకాళి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ ఈఓ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మంత్రులకు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. రైతును రాజును చేయడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమన్నారు. అన్నదాతలను సంఘటిత పరిచి.. వారికి కావాల్సిన సదుపాయాలు, మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. అందుకే సాగునీరు, విత్తనాలు, 24 గంటల విద్యుత్‌, రైతు వేదికలు, కల్లాలు, అనేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సరైన పంటల ప్రణాళిక, పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి ఏటా రూ.400 కోట్లు రైతాంగ సంక్షేమానికి ఇచ్చేందుకు సిఎం ఆలోచిస్తున్నారన్నారు. కష్టకాలంలో రైతుల పంటలను కొనుగోలు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు.