బడ్జెట్పై లోక్సభకు సమాధానం ఇచ్చిన నిర్మలా
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్పై చర్చ అనంతరం శనివారం లోక్సభకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా సృష్టించిన సంక్షోభంలోనూ ప్రభుత్వం సంస్కరణలకు సంబంధించిన అవకాశాలను వదులుకోలేదని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే సంస్కరణలను కరోనా మహమ్మారి నిరోధించలేకపోయిందని, దేశ దీర్ఘకాలిక అభివృద్ధికి సంస్కరణలు తప్పనిసరని చెప్పారు.
తాజా బడ్జెట్ ప్రధాని నరేంద్రమోడి అపారమైన అనుభవానికి, పరిపాలనా సామర్థ్యాలకు నిదర్శనమని నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. బడ్జెట్లో ఆరోగ్యరంగానికి పెద్దపీట వేశామని, దేశ ప్రజల సంక్షేమానికి ఇది ఎంతో దోహదపడుతుందని ఆమె చెప్పారు. కొందరు పనిగట్టుకుని బడ్జెట్పై విమర్శలు చేస్తున్నారని, ధనికుల మేలుచేసేలా బడ్జెట్ ఉందంటున్నారని ఆర్థికమంత్రి విమర్శించారు. బడ్జెట్ పీఎం స్వనిధి యోజనకు భారీగా నిధులు కేటాయించామని, ఆ పథకం ధనవంతులకు ఉపయోగపడేది కాదని చెప్పారు.రెవెన్యూ విభాగానికి 201314 బడ్జెట్లో రూ.1,16,931 కోట్లు కేటాయిస్తే తాజా బడ్జెట్లో రూ.2,09,319 కోట్లు కేటాయించామని, పింఛన్ల కోసం 201314 బడ్జెట్లో 44,500 కోట్లు కేటాయించగా ఇప్పుడు అది రూ.1,33,825 కోట్లకు పెరిగిందని నిర్మలాసీతారామన్ వెల్లడించారు.