ఫిలిప్పీన్స్ లో కొత్త చట్టం

పట్టభద్రుడు అయ్యేలోపు ప్రతి విద్యార్థి 10 మొక్కలు నాటాల్సిందే

మనీలా: ఆసియా దేశం ఫిలిప్పీన్స్ లో ఆసక్తికర చట్టం చేయడం పర్యావరణ ప్రాధాన్యతను చాటిచెబుతోంది. ఫిలిప్పీన్స్ లో ప్రతి విద్యార్థి తాను పట్టభద్రుడు అయ్యేలోపు కనీసం 10 మొక్కలు నాటాలని ఆ చట్టంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బిల్లు ఫిలిప్పీన్స్ చట్టసభలో మే 15న ఆమోదం పొంది చట్ట రూపం దాల్చింది. ఓ విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసం మొదలుకుని హైస్కూల్, కాలేజీ విద్యాభ్యాసం పూర్తి చేసే క్రమంలో 10 మొక్కలు తప్పనిసరిగా నాటాలని ఆ చట్టంలో పొందుపరిచారు. ఈ విధానం వల్ల ప్రతి ఏటా 175 మిలియన్ మొక్కలు నాటే అవకాశం ఉందని, తద్వారా ఓ తరంలో 525 బిలియన్ మొక్కలు ఈ భూమిపై పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ మొక్కలను అటవీప్రాంతాల్లోనూ, పాడుబడిన గనుల్లోనూ నాటాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఫిలిప్సీన్స్ విద్యాశాఖ పర్యవేక్షించనుంది. 20వ శతాబ్దంలో ఫిలిప్పీన్స్ లో చెట్ల నరికివేత విపరీతంగా సాగింది. దాంతో అక్కడి వృక్ష సంపద దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలోనూ కొత్త చట్టానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.