న్యూయార్క్‌ అసెంబ్లీలో కశ్మీర్‌ పై తీర్మానం

మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్న భారత్

న్యూయార్క్‌‌: అమెరికాలోని నూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఫిబ్రవరి 5వ తేదీని ‘కశ్మీర్ అమెరికన్ డే’గా ప్రకటించాలని తీర్మానం చేసింది. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయేగ్ మరో 12 మంది సభ్యులు కలిసి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. న్యూయార్క్ లోని వలసవాదుల్లో కశ్మీర్ సమాజం ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందని తీర్మానంలో వారు పేర్కొన్నారు. కశ్మీరీ ప్రజలకు భావ వ్యక్తీకరణ, మత స్వేచ్ఛను కల్పించడానికి న్యూయార్క్ ప్రయత్నిస్తుందని తెలిపారు.

ఈ తీర్మానంపై అమెరికాలో భారత దౌత్య కార్యాలయం ప్రతినిధి తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో కశ్మీర్ ఒక అంతర్భాగమని చెప్పారు. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. జమ్మూకశ్మీర్ సంస్కృతిని, సామాజిక స్థితిని తప్పుగా చూపించేందుకు, ప్రజలను విడదీసేందుకు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నమే ఇదని విమర్శించారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యులను కలిసి ఇరు దేశాల మధ్య బంధాలపై చర్చిస్తామని చెప్పారు.