నిమ్మగడ్డ ఆటలకు ఫుల్ స్టాప్ పడింది
2019లోనే టిడిపిని ప్రజలు సమాధి చేశారు
అమరావతి: వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే రోజా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపిని బతికించే ప్రయత్నాన్ని నిమ్మగడ్డ చేస్తున్నారని అన్నారు. 2019లోనే టిడిపిని ప్రజలు సమాధి చేశారని చెప్పారు. ఆ సమాధిలో నుంచి శవాన్ని తీసి బతికించాలనే ప్రయత్నాన్ని నిమ్మగడ్డ చేశారని అన్నారు. ఇది జరిగే పని కాదని మొన్ననే ప్రెస్ మీట్ లో తాను చెప్పానని… ఇప్పుడు అదే జరిగిందని చెప్పారు. 2019లో పెట్టాల్సిన ఎన్నికలను అప్పుడు పెట్టకుండా, కుట్రపూరితంగా ఇప్పుడు పెట్టారని విమర్శించారు.
రిటైర్ అయ్యే లోపల టిడిపి అధినేత చంద్రబాబుతో శభాష్ అనిపించుకోవాలని నిమ్మగడ్డ అనుకున్నారని… కానీ, జనాలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. నిమ్మగడ్డ ఆటలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పారు. నగరి నియోజకవర్గ ప్రజలకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని… రెండు సార్లు తనను గెలిపించి అసెంబ్లీకి పంపించారని, ఇప్పుడు తొలిసారి తాను ఎదుర్కొన్న పంచాయతీ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్సిపికి ఘన విజయాన్ని కట్టబెట్టారని అన్నారు.