దేవస్థానం బోర్టు విజ్ఞప్తిని తిరస్కరించిన కేరళ ప్రభుత్వం

శబరిమలకు ఎక్కువ మందిని అనుమతించలేం..కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో భక్తుల ప్రవేశంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుంభనెల సందర్భంగా ఎక్కువ మందిని అనుమతించాలని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం చేసిన విజ్ఞప్తి ప్రభుత్వం తిరస్కరించింది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఐదువేల మంది భక్తులను అనుమతించామని, అంతకంటే ఎక్కువ మందిని అనుమతించడం వీలుకాదని స్పష్టం చేసింది. కుంభనెల నేపథ్యంలో ఈ నెల 12న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకోనుంది. ఈ సందర్భంగా 15వేల మంది భక్తులకు అవకాశం కల్పించాలని కోరుతూ.. ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా తీవ్రతను అంచనా వేసి.. నిర్ణయాన్ని వెల్లడించాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఆలయంలోకి ఎక్కువ మంది భక్తులను అనుమతిస్తే వైరస్‌ తీవ్ర పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వం దేవస్థానం బోర్డు చేసిన విజ్ఞప్తి తిరస్కరించింది.