టిడిపి మేనిఫెస్టోను ప్రజలు మొదటి రోజే తిరస్కరించారు
అయినా చంద్రబాబుకు తెలియక విడుదల చేశారా? విజయసాయి
అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టిడిపి మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ రహితంగా జరుగుతున్న స్థానిక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం సరికాదంటూ వైఎస్ఆర్సిపి చేసిన ఫిర్యాదుతో దాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంపై వైఎస్ఆర్సిపి నేతలు స్పందిస్తూ చురకలంటించారు.
‘టిడిపి పంచాయతీల ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు మొదటి రోజే తిరస్కరించారు. ఇప్పుడు ఉపసంహరించుకోవాలని నిమ్మగడ్డ సుతిమెత్తని హెచ్చరిక జారీ చేస్తున్నారు. అయినా చంద్రబాబుకు తెలియక విడుదల చేశారా? ఎల్లో మీడియాను రోజంతా ఎంగేజ్ చేయడానికి ఆ తతంగం పెట్టుకున్నాడు’ అని వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.