చైనా నుండి ఎదురవుతున్న సవాళ్లను అమెరికా నేరుగా ఎదుర్కొంటుంది

విదేశాంగ శాఖ ఉద్యోగులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగం

వాషింగ్టన్‌: చైనా నుంచి తన దేశానికి ఎదురయ్యే సవాళ్లను నేరుగానే ఎదుర్కొంటానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ లో యూఎస్ విదేశాంగ శాఖ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన బైడెన్, చైనాను ఎదుర్కొనే విషయంలో ఏ విధమైన వెనుకడుగూ వేయబోనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అమెరికా ప్రయోజనాలు దెబ్బతిననంతకాలం చైనాతో కలసి పని చేసేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు.

‘ఆర్థిక పరంగా ఎదురయ్యే సవాళ్లపై పోరాటం సాగిస్తాం. మా నుంచి వచ్చే ప్రతిస్పందన దూకుడుగా ఉంటుంది. మానవ హక్కుల ఉల్లంఘన, మేధో సంపత్తి మరియు ప్రపంచ పాలనపై చైనా దాడిని వెనక్కి నెట్టడానికి ఏ మాత్రం వెనుకంజ వేయబోము. ఇదే సమయంలో మరో విషయాన్ని కూడా స్పష్టం చేయాలని భావిస్తున్నా. బీజింగ్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధం. అది ఇరు దేశాలకూ లాభం కలిగేలా ఉండాలి. చైనాతో పాటు అన్ని దేశాలతో భాగస్వామ్యాలను పెంచుకుంటాం. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తాం’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.