గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ మొక్కలు నాటుతూ..మరికొంతమందికి ఈ ఛాలెంజ్ ని విసురుతున్నారు. సినీ , రాజకీయ, బిజినెస్ ఇలా అనేక రంగాల వారు ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం జరిగింది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పాల్గొన్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. మొక్కలు నాటిన తర్వాత నిహారిక సెల్ఫీ తీసుకున్నారు.

అనంతరం ఆ మొక్కలతో కలిసి ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని నిహారిక అన్నారు. తన తండ్రి నాగబాబు ఎప్పుడు ప్రకృతిని ప్రేమించాలని, మొక్కలు పెంచాలని చెబుతూ ఉంటారని చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలాగే నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోశ్ కుమార్‌కు నిహారిక కృతజ్ఞతలు తెలిపారు.