గోడలో భారీగా నగదు, వెండి ఇటుకలు లభ్యం

ముంబయి: ముంబయిలోని ఓ వ్యాపార సంస్థ కార్యాలయ గోడలను, నేలను అధికారులు తవ్వి చూడగా కట్టల కొద్దీ నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. కల్బాదేవి ప్రాంతంలో 35 చదరపు అడుగుల కార్యాలయంలో రహస్యంగా దాచిన సుమారు రూ.10 కోట్ల విలువైన సొత్తును అధికారులు గుర్తించారు. చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం నేలలో, గోడలో ఏర్పాటుచేసిన రహస్య అరల నుంచి రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అనుమానిత కంపెనీల లావాదేవీలను పరిశీలించిన మహారాష్ట్ర జీఎస్‌టీ అధికారులు ఆ క్రమంలో చాముండా బులియన్‌ టర్నోవర్‌ గత మూడేళ్లలో రూ.23 లక్షల నుంచి రూ.1,764 కోట్లకు పెరగడాన్ని గుర్తించారు.

దీంతో కల్బాదేవి సహా మూడు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై గత బుధవారం దాడులు నిర్వహించారు. తొలుత కల్బాదేవిలో 35 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయంలో ఏమీ లభించలేదు. అయినప్పటికీ గదిలో నేలపై ఏర్పాటుచేసిన ఫలకలను (టైల్స్‌) అధికారులు మరింత నిశితంగా పరిశీలించగా ఓ మూలన ఉన్నది కొద్దిగా భిన్నంగా కనిపించింది. అనంతరం ఆ ఫలకను తొలగించి చూడగా.. నగదు కుక్కిన గోనె సంచులు బయటపడ్డాయి. ఈ సంచుల గురించి తమకేమీ తెలియదని కంపెనీ కార్యాలయ యజమాని, అతని కుటుంబసభ్యులు చెప్పడంతో అధికారులు ఆ గదిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించారు. అనంతరం వారు వచ్చి గదిని పరిశీలించి.. గోడలో ఉన్న రహస్య అరను గుర్తించారు. అందులో నుంచీ నగదు నింపిన గోనె సంచులు బయటపడ్డాయి. సోదాల్లో రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు సైతం లభించాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/