ఎలక్షన్‌ ఎఫెక్ట్‌..పెట్రోల్​, డీజిల్ ధరలను తగ్గించిన అసోం

రూ.5 చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రకటించిన ఆర్థిక మంత్రి

గువాహటి: అసోంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యలో అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు భారీ ఊర‌ట క‌లిగించింది. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై లీట‌ర్‌కు ఏకంగా రూ.5 త‌గ్గించింది. అలాగే మ‌ద్యంపై డ్యూటీని 25 శాతం తగ్గించింది. శుక్రవారం ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వాస్ అసెంబ్లీలో దానిపై ప్రకటన చేశారు. మార్చి-ఏప్రిల్ లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి కూడా అధికారాన్ని కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది బిజెపి. అందుకే ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడి, హోం మంత్రి అమిత్ షాలు ఆ రాష్ట్రంలో పర్యటించారు. వరాల జల్లు కురిపించారు.

వాస్తవానికి పెట్రోల్, డీజిల్ రేట్లపై బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం అగ్రిసెస్ ను విధించింది. దాని వల్ల రూ.3 వరకు భారం పడింది. దీనిపై సామాన్యుల నుంచి ప్రతిపక్షాల దాకా విమర్శలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే అసోం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.