ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు లేఖ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలను, ఉల్లంఘనలకు వివరించి తక్షణ చర్యలు కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఈసీకి లేఖ రాశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వైస్సార్సీపీ తీవ్రంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి ఉషా శ్రీచరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్‌కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని.. ఓటుకు రూ.1000 పంచాలని స్వయంగా మంత్రి చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఎంపీ మిథున్ రెడ్డి కడప క్రాస్ నుంచి తంబళ్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించారని తెలిపారు. 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉన్నా… ఆ నిబంధనలు ఎంపీ ఉల్లంఘించారన్నారు.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని వార్డు నెం. 16, బూత్ నంబర్: 232లో వైస్సార్సీపీ అనుచరుడు ఈశ్వరరావు డబ్బు పంపిణీ చేస్తూ పట్టుబడ్డాడని అన్నారు. తిరుపతి పట్టణంలో 9వ తరగతి విద్యార్హత కలిగిన విజయ అనే మహిళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమ ఓటు వేసిందని.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైస్సార్సీపీ అనుచరులు రమణ మహర్షి స్కూల్ వద్ద డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారన్నారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పోలింగ్ బూత్‌లలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆగ్రహించారు.