ఆ ప్రచారం ఆపండి..రతన్‌ టాటా

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై టాటా స్పందిస్తూ.. ఇలాంటి ప్ర‌చారాల‌ను మానివేయాలంటూ ర‌త‌న్ టాటా ట్విట్ట‌ర్ యూజ‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. ఓ అవార్డు విష‌యంలో కొంద‌రు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగిస్తున్నార‌ని, అయితే వారి మ‌నోభావాల‌ను గౌర‌విస్తాన‌ని, కానీ అలాంటి ప్ర‌చారాల‌ను నిలిపివేయాల‌ని స‌గౌర‌వంగా వేడుకుంటున్న‌ట్లు ర‌త‌న్ టాటా త‌న ట్వీట్‌లో తెలిపారు.

భార‌తీయుడిగా పుట్టినందుకు గ‌ర్విస్తున్నాన‌ని, దేశ ప్ర‌గ‌తికి స‌హ‌క‌రించేందుకు ఎప్ప‌డూ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాన‌ని ర‌త‌న్ టాటా అన్నారు. మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ డాక్ట‌ర్ వివేక్ బింద్రా సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల క్యాంపేయిన్ స్టార్ట్ చేశారు. ర‌త‌న్ టాటాకు భార‌త‌ర‌త్న ఇవ్వాలంటూ ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ ట్రెండ్ అయ్యింది. ట్విట్ట‌ర్ యూజ‌ర్ల నుంచి వివేక్ ట్వీట్ కు భారీ మ‌ద్దుతు ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ర‌త‌న్ టాటా త‌న ట్వీట్‌లో ఇవాళ స్పందించారు.