ఆందోళనకారులపై కాల్పులు జరిపిన పాక్‌ సైన్యం

ఇస్లామాబాద్‌: తన సొంత పౌరులనే పాకిస్థాన్‌ ఆర్మీ కాల్చి చంపింది. ఈ ఘటన ఖైబర్ ఫఖ్తూంక్వా ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఖైబర్ ప్రావిన్స్ లోని కోహిస్తాన్ జిల్లాలో దాస్ హైడ్రోపవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం స్థానిక ప్రజలు తమ భూములను ఇచ్చారు. భూములను తీసుకున్న ప్రభుత్వం వారికి ఇస్తామని చెప్పిన నష్ట పరిహారాన్ని ఇంత వరకు ఇవ్వలేదు.

దీంతో, స్థానికులు ఆందోళనకు దిగారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే పాక్ ఆర్మీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆందోళనకారులపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మరోవైపు సైన్యం చర్యలపై అక్కడి ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.