అమరావతే రాజధాని అనేది బీజేపీ స్టాండ్ : కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి రైతులను జగన్ మోసం చేశారు

తిరుపతి: సీఎం జగన్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక ఇగోయిస్టు, శాడిస్టు, ఫ్యాక్షనిస్టు అని విమర్శించారు. తిరుపతిలో ఈరోజు అమరావతి రైతులు బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు హాజరయ్యేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, ఐదు కోట్ల ఆంధ్రుల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి రైతులు భూములిచ్చారని చెప్పారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో ముందుకు వెళ్లడం మూర్ఖత్వమని అన్నారు. అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వం పెడుతున్న బాధలను భరిస్తూనే రైతులు తమ పాదయాత్రను పూర్తి చేశారని చెప్పారు. అమరావతే రాజధానిగా ఉండాలనేది బీజేపీ స్టాండ్ అని తెలిపారు.

రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ, దళితులను జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. ఏ దళితులైతే జగన్ ను అధికారంలోకి తీసుకొచ్చారో… వారే అధికారం నుంచి దించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను జగన్ మానుకోవాలని హితవు పలికారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/