అన్నదాత జీవితాల్లో వెలుగు నింపిన ఘనత సిఎం కెసిఆర్‌ దే

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తన తాతయ్య-నానమ్మ పేరిట సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రైతులకు పెట్టుబడి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. కేంద్రంలో బిజెపి అమలు చేస్తున్న కిసాన్‌ నమ్మాన్‌ నిధి పథకానికి మన రైతుబంధు పథకమే స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ అన్నదాత జీవతాల్లో వెలుగు నింపిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల జీవితాల్లో గణనీయ ప్రగతి వచ్చిందన్నారు. తెలంగాణ రాకముందు రైతులు సాగునీటి కోసం బోరుబావులపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఉండేది.

అర్ధరాత్రులు విద్యుత్‌ కోసం పొలాల వద్ద పడిగాపులు గాయాల్సిన వచ్చేది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చిందని గుర్తుచేశారు. రైతు వేదికల్లో అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.  రైతు వేదికల నుంచి నేరుగా విస్తరణాధికారులతో మాట్లాడొచ్చని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఓ క్లస్టర్‌, ఓ వ్యవసాయ విస్తరణాధికారి ఉండాలని చెప్పారు.