సీబీఐ కోర్టుకు హాజరైన జగన్

హైదరాబాద్ః వైఎస్ఆర్సిపి అధినేత, ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో ఆయన ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే… సీబీఐ న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నందున కేసును వచ్చే శుక్రవారం 22వతేదీకి వాయిదా వేశారు. కాగా… ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఏపీలో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం కోర్టు వాయిదా ఉండడంతో పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించి హైదరాబాద్ వచ్చారు. జడ్జి సెలవులో ఉండడం, కేసు 22వతేదీకి వాయిదా పడడంతో వెంటనే ఆయన అనంతపురం జిల్లా ఉప్పనాసనపల్లికి బయలుదేరారు.