సీఎం జగన్తో చిరంజీవి భేటీ ఆయన పర్సనల్ : మంచు విష్ణు
ఒకరిద్దరు ప్రభుత్వంతో మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదు

తిరుపతి : ఏపీలో సినిమా టికెట్ల రేట్ల విషయంపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి చర్చించారు. ఈ రోజు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి దీనిపై స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి రావాలని ఆయన అన్నారు.
ఈ వివాదంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని మంచు విష్ణు తెలిపారు. తాము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. అంతేగానీ, విడిగా మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించలేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల సీఎం జగన్ తో చిరంజీవి భేటీ వ్యక్తిగతం అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకరిద్దరు ప్రభుత్వంతో మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని ఆయన తెలిపారు. వ్యక్తిగతంగా ఎవరూ తన అభిప్రాయం అడగడం లేదని మంచు విష్ణు తెలిపారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచారని, ఏపీలో తగ్గించారని గుర్తు చేశారు. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/