సివిల్ సర్వీసెస్కు మరో 66మంది అభ్యర్థులు

న్యూఢిల్లీ, : రిజర్వు జాబితాలో ఉన్న మరో 66 మంది అభ్యర్థుల పేర్లను వివిధ సివిల్ సర్వీసెస్ పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సిఫారసు చేసిందని అధికారులు గురువారం తెలిపారు. 2017 సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 27న విడుదల చేసిన విషయం విదితమే. 1058 ఖాళీ పోస్టులకుగాను.. 990 మంది అభ్యర్థులను ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర పోస్టుల్లో నియమించేందుకు యూపీఎస్సీ సిఫారసు చేసింది. అనంతరం తాజాగా ఆయా క్యాటగిరీల్లో మెరిట్ ఆధారంగా రిజర్వు జాబితాను సైతం సిద్ధంచేసింది. దీని ఆధారంగా ప్రస్తుతం 48 మంది జనరల్, ఓబీసీ 16 మంది, ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరు చొప్పున మొత్తం 66 మంది అభ్యర్థులను ఆయా పోస్టులకు సిఫారసు చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ జాబితాను యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపర్చామని పేర్కొన్నది.