వాల్మార్ట్లో వెయ్యి కొత్త కొలువులు

న్యూఢిల్లీ: ప్రపంచ రిటైల్ కంపెనీ వాల్మార్ట్ భారతదేశంలో తన ఇ-కామర్స్ బిజినెస్ను మరో అడుగు ముందుకు వేయాలని ప్రణాళికలేస్తోంది. టెక్నాలజీ ఆపరేషన్స్ విస్తరణకోసం భారీగా టెకీలను నియమించుకునేందుకు సిద్ధపడుతోంది. దేశీయంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగులను నియమించుకోనుంది. తద్వారా రిటైల్ బిజినెస్ రంగంలో దూసుకుపోవాలని చూస్తోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ సంస్థ వాల్మార్ట్ తన ప్రతిభను మరింత ఇనుమడింప చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే భారీ వేతన ప్యాకేజీలు టెకీలకు 6లక్షల నుంచి 22 లక్షల రూపాయల వరకూ జీతాలను ఆఫర్ చేయనుంది. ముఖ్యంగా ఇ-కామర్స్ రంగ దిగ్గజం అమెజాన్కు పోటీగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారితంగా సంస్థగా ఉండేందుకు, ప్రధానంగా భారతీయ ఉత్పత్తులకు ప్రోత్సాహమిచ్చేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టామని వాల్మార్ట్ ముఖ్య సమాచార అధికారి క్లే జాన్సన్ వెల్లడించారు. కాగా గురుగావ్, బెంగళూరు ద్వారా సేవలను అందిస్తున్న సంస్థలో ప్రస్తుతం 1800 మంది ఉద్యోగులున్నారు. సంవత్సరానికి సుమారు 10 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెరికా వెలుపల వాల్మార్ట్ లాబ్స్ పేరుతో ఇండియాలో అతిపెద్ద వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.