తండాల అభివృద్ధి కోసం పోరాటం: రవీంద్రనాయక్

హైదరాబాద్ఃగిరిజనుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్న సిఎం కెసిఆర్పై పోరాటం చేయడాని సన్నద్ధమవుతున్నట్లు మాజీ ఎంపి రవీంద్రనాయక్ చెప్పారు. సోమవారం గాంధీభవన్లో గాంధీట్రస్ట్ సభ్యులు సూర్యానాయక్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్లో గిరిజనుల మధ్య జరిగిన చిచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పాకిందన్నారు. గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి కెసిఆర్ రాజకీయ ప్రయోజనం పొందుతుంటే టిఆర్ఎస్ నాయకులు కెసిఆర్కు పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజనులకు అన్యాయం చేసిన గిరిజనుల దేవతల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న కెసిఆర్ గిరిజనులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. గిరిజనులను మోసం చేస్తుంటే గిరిజన ప్రజాప్రతినిధులు కెసిఆర్కు వత్తాసు పలుకుతూ పాలాభిషేకాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన తండాల్లో పర్యటించి సమస్యలపై పోరాటాలు చేస్తామని రవీంద్రనాయక్ హెచ్చరించారు.