ముంబయి జనవరి 4:- భారతీయ ఆర్థిక రంగం అంతర్జాతీయ ఆర్థిక మాంద్య ప్రభావం నుంచి ఇప్పటికీ కోలుకుంటున్నదని అందువల్ల ప్రభుత్వం తన ఉద్దీపన ప్యాకేజీని మరికొంత కాలం కొనసాగించాలని జెఎస్డబ్ల్యుఎనర్జీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రమోద్మీనన్ పేర్కొ న్నారు. ఈ ప్యాకేజీ వల్లనే ఇండియా మాంద్య పరిస్థితిలో నుంచి తిప్పించుకోగలిగిందని, ఆ వాణిజ్య విశ్వాసంతోనే కార్పొరేట్ సంస్థలు భారీ ప్రాజెక్టులను చేపడుతున్నాయని, ఈ వృద్ధిని కొనసాగించడానికి ప్రభుత్వం తన విధానాలను కూడా కొనసాగించాలని కూడా ఆయన కోరారు.కార్పొరేట్ సంస్థలు తమ కెపాసిటీలను విస్తరించి నప్పుడే ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుందని అన్నారు. జెఎస్డబ్ల్యు ఎనర్జీ ప్రస్తుతం 2,700 మెగావాట్ల ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నది.
ఇందులో 2100 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగల యూనిట్లు 2010 డిసెంబరులోగా పూర్తి అవుతాయి. అందులో మహారాష్ట్రలోని రత్నగిరి వద్ద ఏర్పాటు చేస్తున్న 1200 మెగావాట్ల ప్రాజెక్టు కూడా ఉంది. మొత్తం ఎనిమిదివేల మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి 40వేల కోట్లను ఖర్చు చేసే దిశగా జెఎస్డబ్ల్యు ఎనర్జీ అడుగు వేస్తున్నది. ఈ విషయాన్ని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ చెప్పారు. మహారాష్ట్రలో 3,200 మెగావాట్లు, ఛత్తీస్గఢ్లో 1320 మెగావాట్లు, పశ్చిమ బెంగాల్లో 1600 మెగావాట్ల ప్రాజెక్టుల గురించి ఆయన ప్రస్తావించారు. 2015 నాటికి తమ కంపెనీ 11వేల మెగావాట్ల కంపెనీగా రూపొందుతుందని చెప్పారు. కంపెనీ 100 రూపాయల ధరతో జారీ చేసిన షేర్లు సోమ వారం లిస్టింగ్ జరిగాయి.
తొలిదశలో రెండు శాతం ప్రీమియంతో ఈ లిస్టింగ్ జరిగింది. నేషనల్ స్టాక్ ఎక్చేంజ్లో 106 వద్ద లిస్టింగ్ జరిగింది. జెఎస్డబ్ల్యు ఎనర్జీ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.2,700 కోట్లు సమీకరించింది. కంపెనీ సేకరించిన నిధుల్లో కొంత భాగాన్ని ప్రస్తుత ప్రాజెక్టులను విస్తరించడానికి, పాత రుణాలు తీర్చడానికి ఉపయోగిస్తారు. కంపెనీ ఉత్పత్తి చేసిన విద్యుత్లో 55 శాతం వాణిజ్య ప్రాతిపదికన విక్రయిస్తున్నారు. మిగిలిన 45 శాతం దీర్ఘకాలిక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల ద్వారా విక్రయిస్తున్నారు. రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో ఇండియాలో విద్యుత కొరత తీవ్రంగా ఉంటుందని జిందాల్ పేర్కొంటున్నారు. విద్యుత్ పంపిణీ రంగంలో అవకాశాలను కూడా కంపెనీ పరిశీలిస్తున్నది. ప్రస్తుతం కంపెనీ విద్యుదుత్పత్తి , పంపిణీ, ట్రేడింగ్ రంగాల్లో ఉన్నది.
పెరిగిన ఉక్కు ధరలు దేశంలో మూడో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు అయిన జెఎస్డబ్ల్యు స్టీల్ తన ఉత్పత్తుల ధరలను మూడు నుంచి ఐదు శాతం పెంచింది. ముడిపదార్థాల ధరలు పెరగడం, తమ ఉత్పత్తులకు గిరాకీ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొన్నది. మొత్తం అన్ని రకాల ఉక్కు ఉత్పత్తులపై ధరలు పెరిగాయి. దేశంలో నిర్మాణ కార్యక్రమాలు మళ్ళీఊతం అందుకోవడం వల్ల ఉక్కుకు గిరాకీ తొమ్మిది శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే బొగ్గు ధరలు ఈసంవత్సరం 20 శాతం పెరిగాయి. అలాగే ఇనుప ఖనిజం ధర 20 నుంచి 30 శాతం పెరిగిందని జెఎస్డబ్ల్యు గ్రూపు ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శేషగిరి రావు చెప్పారు.