తెలుగు భాషలోని మాధుర్యం శతకాల్లో, పురాణగాధల్లోనూ, కార్యాల్లోనూ ఉంటుంది. గతించిన రోజుల్లోనైతే పిల్లల చదువు సంధ్యలు ఎలా ఉన్నాయో తెల్సుకునేందుకు. ఏదీ...వేమన శతకంలోని పద్యాలో, భాస్కర శతకంలోని పదాయలో వచ్చినవి రెండు చెప్పమనేవారు. ఎవరైనా పెద్దవాళ్లు ఇంటికి వస్తే.పోతన భాగవతంలోని 'గజేంద్ర మోక్షం నుండి రెండు పద్యాలు టీ.కా. తాత్పర్యాలతో చెప్పుకునేవారు. ఆడపిల్లల చేత 'రుక్మిణీ కళ్యాణాన్ని పారాయణం చేయించేవారు.ఇవి పిల్లలకు తాత్పర్యాలు అర్థం కాకపోయినా పదేపదే వల్లె వేయించేవారు. గమ్మత్తు అదేమిటో గానీ శైశవప్రాయంలో నేర్చుకున్న పద్యాలు పెద్దైనా కూడా గుర్తుండిపోతాయి.తిరిగి పద్యాలను కంఠతా వల్లిస్తారు.
ఇప్పుడంతా స్పీడు ప్రపంచం కాబట్టి వాటిని నేర్పేవారు లేరు. నేర్చుకునే తీరిక, ఓపికా రెండు లేవు.పైగా-'దేనికిప్పుడు? ఇప్పుడు అంత అవసరమా? అన్న కామెంట్స్ రివాజుగా మారిపోయింది.ఎవరైనా వేదికల పైన పద్యాలనో, స్తోత్రాలనో, శ్లోకాలనో ఆలపిస్తుంటే ఎంత బాగున్నాయి! ఎంతటి స్పష్టత! ఎంతటి భావం! పొంగిపోవడం కద్దు. తమ పిల్లలకు నేర్పించాలన్న తపన ఉన్నా..మళ్లీ స్పీడు ప్రపంచపు అధ్యయన, అభ్యసన కృత్యాలే.పాఠశాలల్లో ఇంగ్లీషు రాజ్యమేల్తోంది.తెలుగు మాట్లాడటమే తప్పుగా భావించే రోజులు కదా ఇవి! మరి తెలుగు భాషలోని మాధుర్యం పిల్లలకెలా అందుతుంది. అమ్మమ్మలో, తాతయ్యలో ఉంటే కాస్తంత 'తెలుగు తీపి రుచి చూపించేవారు. ఇప్పు డన్నీ వ్యష్టి కుటుంబాలు కదా!
ఈ నేపథ్యంలో పద్య పఠనం పిల్లలకు దూరమై పోయింది. ఇందుకు పాఠశాలలూ బేధంగా లేవు. ఉండటానికి తెలుగు లాంగ్వేజ్ సబ్జెక్ట్గా ఉంటుంది. కానీ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ వీటి మీదనే తొంభై తొమ్మిది శాతం దృష్టి కేంద్రీ కరించబడి ఉంటుంది. 'ఆ..తెలుగు పేపర్ దేముం దిలెద్దూ..ఏదో ఒకటి పరీక్షల్లో వ్రాసేస్తార్లే అన్నధోరణి.దీంతో తెలుగు తీపితనం మాయమై పోతుంది. పిల్లల్లో దాని పట్ల చులకన భావం ఏర్పడింది.అలా ఏర్పడటానికి కారణం మనమే.
తెలుగుతల్లి, తెలుగు భాష, తెనుగుదనం, ఇటా లియన్ ఆఫ్ ది ఈస్ట్?? ఎన్ని పొగడ్తలు. మెచ్చు కోళ్లు.మాతృభాషా దినోత్సవాల నాడు అందరూ తెలుగు భాషను ఆకాశానికి ఎత్తేశేవారే! కానీ ఆచరణలోనికి వచ్చేసరికల్లా! తమ పిల్లల విషయానికొచ్చె సరికల్లా!! ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పని ఎవ్వరూ అనరు. అవసరమే. పోనీ ఆ భాషనైనా పరిపూర్ణంగా అందిస్తున్నారా! పిల్లలు నేర్చుకుంటున్నారా! అంతా స్వచ్ఛత, స్పష్టత, భావ వ్యక్తీకరణ పూర్ణంగా లేని పొడిపొడి పల్కులే.కర్త, కర్మ, క్రియలుండవు. వారి ముఖ కవళికలను బట్టి ఎదుటివారు అర్థం చేసుకోవల్సిందే. ఇదేదో ప్రాథమిక స్థాయి పిల్లల్లో కాదు. పై చదువులు కళాశాలల్లో చదువుతున్న వారిలో ఉంది.
భాష పట్ల తపన, అభిరుచి ఉండాలే కానీ, ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో దేంట్లోనైనా పట్టు సాధించవచ్చు.తెలుగు భాష ఔన్నత్యం గురించి ప్రత్యేకించి ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ తెల్సిందే.గద్యరూప సాహిత్యం కంటే సరళీకృతం గావించబడి ఉన్న పద్యాలను పిల్లలకు తల్లిదండ్రులైనా అందించగల్గితే భాషా మాధుర్యం పిల్లలకు అవగతమవుతుంది.జీవనసత్యాలను, ధర్మాలను, నీతిప్రభోదాలను కేవలం నాలుగు పాదాల్లో ఇమడబడి ఉన్న పద్యాలను వల్లె వేయించేందుకు కొంచెం సమయం రోజులో కేటాయిస్తే ఆ తీపిని వాళ్లకూ ఇంత పంచి వారమవుతాం. కార్టూన్ నెట్వర్క్, యానిమేషన్ చిత్రాల ఛానెల్స్ పట్ల విపరీతమైన అభిరుచి పిల్లలకు. కథా సాహిత్యం పట్ల లేకుండా పోయింది.
మహనీయుల చరిత్రలు, బాలరామాయణం, భారతం, పంచతంత్ర కథలు, చందమామ, బాలమిత్ర, మర్యాద రామన్న కథలు-కనీసం తల్లి తండ్రులు తెచ్చి పడేస్తుంటే కొంతవరకైనా పిల్లలు వాటిపట్ల ఆకర్షితులై తిరగేసే అవకాశం ఉంటుంది. పఠనాభిలాష పెరుగుతుంది. తద్వారా తెలుగు భాషలో కొంతమేరకు పట్టు దొరుకుతుంది. మనసుండాలే కానీ భాష పట్ల మమకారం పెంచ డానికి మార్గాలు లేకుండా పోయాయా?