Home » వాణిజ్యం » హైదరాబాద్ భవిష్యత్తుపై 'రియల్ గందరగోళం
హైదరాబాద్ భవిష్యత్తుపై 'రియల్ గందరగోళం
శని వారం, డిసెంబర్ 19, 2009 , 11:46 [IST]
హైదరాబాద్ డిసెంబరు 19:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చెలరేగుతున్న వివాదాలను పలు ఇతర రంగాల పారిశ్రామికులతో పాటు రియల్ ఎస్టేట్ డెవలపర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారు. హైదరాబాద్ భవిష్యత్తు ఏలా ఉంటుందన్న అంశాన్ని వారు తేల్చుకోలేకపోతున్నారు.హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటే తమ వ్యాపారాలకు రక్షణగా ఉంటుందన్న అభిప్రాయం వారికి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ఐటి రంగంలో సెంటిమెంట్ దెబ్బతినడం వల్ల రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతిని ఉంది. బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల మళ్ళీపుంజుకుంటుందన్న ఆశ వేర్పాటు ఉద్యమా లతో సన్నగిల్లిపోయింది.
తాము కట్టే ప్రాజెక్టులకు డిమాండు ఉంటుందా?తాము సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయగలమా అన్న సందేహాలు వారిలో తలెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా, లేక రాష్ట్రం సమైక్యంగాఉన్నా లేక రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉన్నా, లేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నా నిజానికి పెద్ద తేడాలు ఉండకూడదు. కాని కొనుగోలుదారుల సెంటిమెంటు దెబ్బతింటే మాత్రం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పూర్తికాకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఎకరా 20కోట్లకు పైగా కొనుగోలు చేసిన డెవలపర్లు ఉన్నారు. ఆ డెవలపర్లు ప్రాజెక్టులను పూర్తి చేస్తే తప్ప మార్కెట్లో నిలదొక్కుకోలేరు. ఇప్పటికేవారు వడ్డీ భారంతో సతమతం అవుతున్నారు. ఇలా సతమతం అయ్యే కంపెనీల్లో పలు లిస్టెడ్ కంపెనీలు, జాతీయస్థాయి కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్ జనాభా త్వరలో కోటి దాటనున్నది.
హైదరాబాద్ దక్షిణాదిలో వ్యాపారానికి కేంద్ర బిందువు కావడమేకాకుండా ఢిల్లీకి ప్రత్యామ్నాయ పట్టణంగా అభివృద్ధిచెందుతుందని, బాంబేతో పోటీ పడే వ్యాపార కేంద్రంగా మారుతుందని ఆశించేవారు లేకపోలేదు. నిజానికి హాంకాంగ్లో బ్రిటిష్ పాలన ముగిసి చైనాపరం అయినప్పుడు హాంకాంగ్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడటానికి చైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఈ తరుణంలోనే హాంకాంగ్కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ను ఏ విధంగా అభివృద్ధిచేయవచ్చో సూచిస్తూ డక్కన్ అండ్ మిక్నీల్ అనే అధ్యయన సంస్థ ఒక నివేదికను తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారం ఎన్టిఆర్ ఘాట్ నిర్మించిన స్థలంలో జంట టవర్స్ రావాల్సి ఉంది. కాని అలా జరగలేదు. ఏదిఏమైనా హైదరాబాద్ భద్రంగా స్థిరంగా, ఆకర్షణీ యంగా పెట్టుబడిదారులకు స్వాగతం పలకాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం కోసం ఎదురుచూస్తున్నామని, ఇంకా మరికొంత కాలం ఎదురుచూడకతప్పదని రియల్ ఎస్టేట్ డెవలపర్లు చెబుతున్నారు. హైదరా బాద్ అభివృద్ధికి ఎంత అవకాశం ఉందంటే ఏ రాజకీయ ఉద్యమం దానిని చెడగొట్టలేదన్న అభిప్రాయం వారిలో ఉంది. అయితే వినియోగ దారులు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉన్న విశ్వా సంతో ఉన్నట్లుగా కన్పించడం లేదు. ఇది ఇలా వుండగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని ధరలు తక్కువగా ఉన్నందున కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా నిర్ణయిస్తే ధరలు భారీగా పెరుగుతాయని డెవలపర్లు అంటు న్నారు. డెవలపర్లు లాభాలు చూసుకోకుండా నగదు కోసం ప్రాపర్టిస్ను విక్రయిస్తున్నారని, ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించేవారు లేకపోలేదు.
ఫార్మా రంగంలోనూ, ఐటి, ఐటిఇఎస్రంగంలోనూ గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాల వల్ల రెండువేల కోట్లు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఐటి ఐటిఇఎస్ రంగంలో వెయ్యి కోట్లు, ఫార్మా రంగంలో వెయ్యి కోట్ల నష్టం వాటిల్లినట్లు భారతీయ పారిశ్రామికుల సమాఖ్య పేర్కొన్నది. అలాగే నిన్న హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ వద్ద జరిగిన సంఘటనలు ఇన్వెస్టర్లను ఆలోచింప చేస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని ఐటి ప్రొఫెషనల్స్ గట్టిగా కోరుతు న్నారు. 1956లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న హైదరాబాద్కు ఇప్పుడున్న హైదరాబాద్కు సంబంధం లేదని వారి వాదన. ప్రస్తుతం హైదరాబాద్ ఇన్వెస్టర్లకు స్నేహపాత్రమైన నగరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా మారిపోయింది.
హైదరాబాద్ కాస్మాపాలిటన్ సిటీగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని, దానిని ఏ ఒక్క ప్రాంతంలో విలీనం చేయకుండా ప్రత్యేకంగా ఉంచాలన్న డిమాండు రోజురోజుకి బలపడుతున్నది. ప్రస్తుతం హెచ్ఎమ్డిఎ ఐదు జిల్లాలకు విస్తరించి ఉంది. అయితే తెలంగాణా ప్రజల్లో హైదరాబాద్ లేని తెలంగాణా తలలేని మొండెంగా భావిస్తున్నారు.
ఇది ఇలావుండగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాల వల్ల హైదరాబాద్, కాకినాడ, అనంతపురంలోని జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాల ఇన్స్పెక్షన్ నిర్వహించాలేక పోయింది. పరీక్షల నిర్వహణ ఆగిపోయింది. కాస్లులు జరగడం లేదు. 600 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం వల్ల క్యాంపస్ రిక్రూటమెంట్ పరిస్థితి ఏమింటన్నది ఇప్పటి ప్రశ్న. దాదాపు రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండి, విద్యా సంవత్సరాల మీద ప్రభావం పడటం లేదు. ఇది ఇలావుండగా స్టేట్ మీడియం స్కూళ్లలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ప్రభుత్వం నడిపే స్కూళ్లలో సెలబస్ మారుతుందన్న భయంతో సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ కోర్సులో చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు.