న్యూఢిల్లీ నవంబర్ 6:- దేశంలో ఆహారోత్పత్తుల ధరలు గత నెల రోజుల్లో 20 శాతం పెరిగాయి. ఈ ధరలు ఇంకా పెరుగుతాయన్న భయాందో ళనలు వినియోగదారుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఒక బియ్యం, గోధుమల ధరలు స్వల్పంగా పెరిగాయి తప్ప మిగిలిన ఉత్పత్తుల ధరలు బాగా పెరిగాయి. ఖరీఫ్ పంట కాలంలో వ్యవసాయో త్పత్తులు సంతృప్తికరంగా లేవన్న వార్తలు రావడంతో ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. మొత్తం ప్రజల ఆహార అవసరాల్లో 20 శాతం ఖరీఫ్ పంటల ద్వారానూ, 20 శాతం రబీ పంటల ద్వారా తీరుతాయి.
మిగిలిన 60 శాతం అవసరాలు వ్యవసాయ కార్యకలాపాలైన ఉద్యావన పెంపకం, పశుగణాల అభివృద్ధి, మత్స్య సంపద ద్వారా తీరుతాయి.ఈ సంవత్సరాంతంలోగా ఆహారోత్పత్తుల ధరలు తగ్గుతాయన్న అంచనాతో ప్రభుత్వం ఉంది.అయితే ఈ అభిప్రాయంతో చాలా మంది అగీకరించడం లేదు. దేశంలోని పలు ప్రాంతాల్లో నవంబరు నాలుగున ధరలు అక్టోబరు నాలుగు కంటే పెరిగినట్లు ఒక అధ్యయనంలో తేలింది. కోడి గుడ్ల ధరలు డజను రూ.30 నుంచి రూ.38కి, కేజీ పసుపు ధర రూ.120 నుంచి రూ.160, కందిపప్పుధర రూ.90 నుంచి రూ.110కి మైదా పిండి ధర రూ.20 నుంచి రూ.26కి పెరిగాయి. గోధుమ ధర మాత్రం రూ.18 నుంచి రూ.20కి, బియ్యం ధర రూ.30 నుంచి రూ.34కి పెరిగాయి.
భారత ప్రజలు తమ ఆహార అవసరాలను కాలానుగుణంగా పెద్దగా మార్చుకోవడం లేదని, అందువల్ల ఒక ఆహార ధాన్యం కొరత ఉంటే మరో ఆహార ధాన్యానికి మళ్లడం లేదని, కందిపప్పు కొరత ఉన్నప్పటికీ అధిక ధరకు కందిపప్పునే కొంటున్నారని, శనగ పప్పువైపు మళ్లడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.అలాగే కొన్ని ప్రాంతాల్లో బియ్యం స్థానంలో గోధుమలు తినడానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటల దిగుబడి తక్కువగా ఉండటం వల్ల ఆహార ధాన్యాలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఈ సంవత్సరం రుతుపవనాల చలనం అస్థవ్యస్థంగా ఉండటం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి 18 శాతం పడిపోతుందని అంచనా. ఏడు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి పడిపోయి 96.63 మిలియన్ టన్నుల మేర ఉంటుందని చెబుతున్నారు.
గత సంవత్సరం ఈ ఉత్పత్తి 117.70 మిలియన్ టన్నుల మేర ఉండేది. రబీ సీజన్లో పంటలు పెంచడానికి ప్రభుత్వం సబ్సిడీ ధరకు విత్తనాలు ఇస్తున్నా దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఉంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. బియ్యం, గోధుమల ధరలు ఒక స్థాయికి మించి పెరిగితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న భయంతో వ్యాపారులు ధరలను కొంత మేర అదుపులో ఉంచుతున్నారు. ప్రభుత్వం వద్ద ఆహార నిల్వలు ఉండటం వల్ల పరిస్థితి చేజారి పోదని విశ్వాసంతో ప్రభుత్వం ఉంది.అయితే ఈసంవ త్సరం ఉన్న పరిస్థితి వచ్చే సంవత్సరం కూడా ఉంటే ఇండియా నిజంగానే ఆహార సంక్షోభంలో కూరుకుపోతుంది.
చెరకు రైతులకు ప్రోత్సాహకాలు చూపి ధరలు పెంచకుండా ముడి చక్కెరను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తాత్కాలిక ఉపశమనమేనని అంతర్జాతీయంగా ముడి చక్కెర ధర కూడా ఇండియా మోయలేనంత స్థాయికి పెరిగాయని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే పసుపు బఫర్ స్టాక్ ప్రభుత్వం వద్ద లేదని, దానిని దిగుమతి చేసుకోవడం కూడా సాధ్యం కాదని, అందువల్ల పసుపు ధరలు దేశీయ గిరాకీ, ఉత్పత్తులు బట్టి ఆధారపడి ఉంటుందని ఆర్ధికవేత్తలు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఆహారోత్పత్తుల ధరలు సరాసరిన 14.4 శాతం పెరిగాయని రిజర్వు బ్యాంకు కూడా తన నివేదికలో అంగీకరించింది.