చెన్నై నవంబర్ 6:- దేశంలో ధనికులకే వైద్య సదుపాయాలు అందిస్తుందన్న విమర్శకు గురి అవుతున్న అపోలో హాస్పిటల్స్ దిగువ స్థాయి ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు విస్తరించాలని ప్రతిపాదించింది. ప్రతి సంవత్సరం కొత్తగా పది ఆస్పత్రులు నిర్మించి మధ్యతరగతికి,దిగువ మధ్యతరగతికి వైద్య సౌకర్యం అందించాలని కోరతున్నది. 1983లో ప్రారంభం అయిన అపోలో హాస్పిటల్స్ రెండు కోట్ల పెట్టుబడితో ప్రారంభం అయింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఆస్పత్రుల స్థాయిలో తమ ఆస్పత్రుల నిర్వహణ ఉన్నదని ఎక్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అంటున్నారు. అల్పాదాయా వర్గాలకు ఆరోగ్య సేవలు అందించాలంటే ఇంకా తాము కష్టపడాల్సి ఉంటుందని ఆయన అంగీకరిస్తున్నారు.
టెక్నాలజీని కొత్త పద్ధతుల్లో వినియోగించడం ద్వారా వారికి కూడా వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేెవడం సాధ్యమేన్నది వారి అభిప్రాయం. ఇందుకోసం అపోలో రీచ్ హాస్పిటల్ పేరుతో 150 నుంచి 200 పడకల ఆస్పత్రులను విరివిగా ఏర్పాటు చేస్తున్నది. ఇక్కడ గుండె ఆపరేషన్లు కూడా చేస్తారు. ఇటువంటి 11 ఆస్పత్రులను వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తి చేస్తామని రానున్న పది సంవత్సరాలు ఏటా పది ఆస్పత్రుల చొప్పున కలుపుకుంటూ మొత్తం 100 ఆస్పత్రులు ఏర్పాటుచేస్తామని ప్రతాప్ సి రెడ్డి అంటున్నారు.
ఇందుకోసం అవసరమైతే అపోలో నిధులను సేకరిస్తుందని, కొందరు భవన నిర్మాతలు ఇందుకు సిద్ధంగా ఉన్నారని, ఇటువంటి ప్రాజెక్టులకు అవసరమైన మానవ వనరులు సమీకరించడమే అసలు సమస్య అని ఆయన పేర్కొంటున్నారు. నర్సింగ్ పేరామెడికల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికి కూడా కొన్ని విద్యా సంస్థలను నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అపోలో ఏటా 800 నుంచి 900 మంది నర్సులకు, 1500 నుంచి 2000 వరకు పేరామెడికల్ సిబ్బందికి ప్రతి సంవత్సరం శిక్షణ ఇస్తున్నది.
రానున్న మూడేళ్ళలో వీరి సంఖ్యను రెట్టింపు చేస్తారు. తమ సంస్థలు నష్టాలు లేకుండా నడవడం ద్వారానే విస్తరిస్తున్నాయని, విస్తరణకు అవసరమైన నిధులను తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా సమకూర్చు కుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అపోలో బ్రాండ్ పేరుతో రోగుల విశ్వాసం చూరగొన్నామని, దానిని కాపాడుకోవడమే ప్రస్తుతం తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.