|
హైదరాబాద్, నవంబర్ 5, ప్రభాతవార్తప్రధాన ప్రతినిధి: 'నిన్న రాత్రి ఒంటిగంట సమయంలో ఎవరో ఫోన్ చేసి సీతారాం చాపర్లపై కోర్టుధిక్కార నేర ప్రక్రియను కొనసాగిస్తే తెల్లవారాక హైకోర్టులో రక్త పాతం సాగుతుంది, మీరు అక్కడ తిరుగలేరు అని బెదించారు. నేను పారిపోవడంలేదు, మీ చర్యలు మీరు కొనసాగించండి, న్యాయ ప్రక్రియను నేను చేపడతానని జవాబు ఇచ్చాను అని హైకోర్టు న్యాయమూర్తి ఎల్ నర్సింహారెడ్డి గురువారం మధ్యాహ్నం కోర్టు హాలులో కోర్టుధిక్కార నేర వ్యాజ్యం విచారణ సందర్భంగా వెల్లడించారు. 'న్యాయవాది వృత్తిని నిర్వహిస్తున్న కొందరు ముందు డబ్బుతీసుకునే వ్యభిచారిణులకన్నా హీనంగా వ్యవహరిస్తున్నారు, ప్రతిభ వున్న న్యాయ కోవిదులెందరో గ్రామీణ ప్రాంతాల్లో ఎర్ర బస్సుల్లో తిరుగుతున్నారు అని ఆవేదన వెలిబుచ్చారు. 'వకాల్తాపై సంతకాలుచేసి, వ్యాజ్యంగూర్చి కనీస సమాచారం తెలుసుకోకుండానే నాట్ బిఫోర్ పేరుతో ఎన్ఓసిలు పొంది ఫోరం పర్చేజ్గా వ్యాపారాలు చేస్తున్నారు, రూ.లక్షలు ఆర్జిస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
'పూట గడవడానికి ఎంత కావాలి, 'నాట్ బిఫోర్తో న్యాయవాదవృత్తిని లాభసాటి వ్యాపా రంగా మార్చారు అని అసంతృప్తి వ్యక్తంచేశారు. 'బార్ కౌన్సిల్లె పేరు నమోదు చేసుకుని, న్యాయవాదుల సంఘం సభ్యుడిగా చేసుకుని మాపైకి పంపుతున్నారు, న్యాయవాదుల ప్రవర ్తనను, పనితీరును పట్టించుకోకపోవడం దురదృష్ట కరం, న్యాయవాదుల బీమ, సంక్షేమ పథకాల పేరుతో తిరుగుతున్నారు, న్యాయవాదులు ఎలా ప్రవర్తిస్తున్నారో పరిశీలించడంలేదు అని విచారం వెలిబుచ్చారు.
కోర్టు ధిక్కార నేరాభియోగానికి బుధవారం గురైన న్యాయవాది సీతారాం చాపర్ల నిన్న రాత్రి న్యాయ మూర్తి డిఎస్ఆర్ వర్మ ఎదుట హౌజ్ మోషన్గా అప్పీలును దాఖలు చేశారు. పోలీసు కస్టడీపై సస్పెన్షన్ విధించిన న్యాయమూర్తి గురువారం ఉదయం డివిజన్బెంచి ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఉదయం 10.30 నిమిషాలకు డిఎస్ఆర్ వర్మ నేతృత్వంలోని డివిజన్ ఎదుట సీతారాం హాజరయ్యారు. అప్పీల్ను తిరస్క రించినట్టు ప్రకటించిన డివిజన్బెంచి కోర్టు ధిక్కారనేరం మోపిన సింగిల్జడ్జి న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించింది. నిందితుడు న్యాయస్థానానికి హాజరుకాగానే ఉదయం విచారణ చేపట్టిన న్యాయస్థానం 'నిందితుడిపై ఏచర్యలు చేపట్టాలి అని అదనపు అడ్వకేటు జనరల్ను ప్రశ్నించింది. 'నిందితుడు న్యాయస్థానాన్నే సవాలు చేశారు, నేరం తీవ్రమైంది, ధిక్కారనేర ప్రక్రియను చేపట్టాలి అని అదనపు అడ్వకేటు జనరల్ సమాధానమిచ్చారు. నిందితుడు జోక్యంచేసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పారు. లిఖితపూర్వకంగా క్షమాపణను దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం అందుకు వీలుగా విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణ ఆరంభంకాగానే నిందితుడు బేషరతు క్షమాపణ పత్రాన్ని నివేదించారు. న్యాయమూర్తి జోక్యంచేసుకుని ఉదయం విచారణ ముగిసినప్పటివరకు మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభమయ్యేవరకు కోర్టులో ఏం చేశావో స్పష్టం చేయాలని ఆదేశించారు. ఏమి చేయలేదని నిందితుడు జవాబివ్వగా 'ఏమిచేయలేదా అని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించారు. 'మీపై కోర్టుధిక్కార పిటీషన్ నమోదు చేశారు, ఎస్ఆర్ స్థాయిలోనే పిటీషన్ను వెనక్కు తీసుకున్నాను అని నిందితుడు జవాబిచ్చారు. 'కోర్టు హాలులో బేషరతు క్షమాపణ ప్రకటించి బయటకు వెళ్ళిన వెంటనే అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిన నిందితుడిపై ఏ చర్యలు చేపట్టాలో తెలపండి అని న్యాయమూర్తి అక్కడేవున్న అదనపు అడ్వకేటు జనరల్ను ప్రశ్నించారు. ధిక్కార నేరాన్ని నమోదు చేయాలని ఎఎజి సూచించారు. 'సమస్య ప్రశాంతంగా పరిష్కారమవుతుందని భావించాను, తీవ్రంగా పరిగణించాల్సిందే అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిందితుడి బేషరతు క్షమాపణను అనుమతించిన న్యాయస్థానం కస్టడీని సస్పెండ ్చేసింది. కోర్టుధిక్కార నేరంపై తీర్పును వాయిదా వేసింది.
|